దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజుకు చేరాయి. శనివారం అమ్మవారికి సారెను మంచికలపూడి గ్రామస్తులు సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.
మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర స్థానిక అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.రత్నకుమార్, కె.శ్రీధర్కుమార్లు ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్రశాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజేష్ ప్రభుకుమార్, సహాధ్యక్షుడిగా ఎన్.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా ఆర్బీవీ కృష్ణారావు, జి.రాంజీ అంబేడ్కర్, ఒ.చిట్టిబాబు, డీఎన్వీ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కె.జగన్నాఽథ్, ఆర్.మధు వెంకటేశ్వరరావు, ఎస్పీ ప్రసన్నకుమార్, కె.సాయి ప్రకాష్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.సూరజ్, బి. రవికుమార్, ఎస్.వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడిగా బీఆర్ అంబేడ్కర్ ఎన్నికయ్యారు.
తెనాలిటౌన్: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి.అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.


