నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందించడంలో అగ్రగామిగా నిలిచారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ–ఫైల్స్ క్లియరెన్స్ నివేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ఒక్కో ఫైలును సగటున కేవలం 7.65 గంటల్లోనే పరిష్కరిస్తూ పాలనలో అత్యంత వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో జాప్యం లేకుండా, పారదర్శకతతో ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఫైళ్ల క్లియరెన్స్లో జిల్లాను అగ్రపథంలో నిలిపిన కలెక్టర్ను జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన సేవలు ఏవైనా నిర్ణీత సమయంలోగా అందేలా చూడటమే తన ప్రాధాన్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.


