మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు లేబర్‌ అడ్డాల ఏర్పాటుకు స్థల పరిశీలన గజవాహనంపై శ్రీవారి దర్శనం రేపటి నుంచి హనుమజ్జయంతి ఉత్సవాలు

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు.

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగరంలో లేబర్‌ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్‌ లేబర్‌ ఆమెనిటీస్‌ కాంప్లెక్స్‌) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్‌ జంక్షన్‌, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్‌ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్‌ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement