కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.


