తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన వై.హర్ష (20) వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6.30 సమయంలో తన స్నేహితుడైన నిఖిల్ సిద్ధార్థతో కలసి ద్విచక్రవాహనంపై తాడేపల్లి వస్తుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద నిఖిల్ సిద్ధార్థ అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొనడంతో నిఖిల్ సిద్ధార్థ నడుపుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హర్ష డివైడర్ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై హర్ష చెల్లి శ్రీ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అపర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


