ఉదయం 8 గంటలకే ప్రతాపం చూపిస్తున్న భానుడు రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత 44 డిగ్రీల మార్కును దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత జిల్లాలో అక్కడక్కడా అకాల వర్షాలు విచిత్ర వాతావరణంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
సత్తెనపల్లి: జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 44 డిగ్రీల మార్కును దాటాయి. ఈ ఉష్ణోగ్రతలకు వృద్ధులు, చిన్నారులు, బాలింతల కష్టాలు వర్ణనాతీతం.
ఒకవైపు అదిరిపోయే ఉష్ణోగ్రతలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాడ్పులు .. మరోవైపు గాలి వానతో అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. జిల్లాలో సాధారణంగా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్క పోత .. బయట సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే 40 డిగ్రీలు దాటడంతో ప్రధాన రహదారులు, పట్టణాల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 5 గంటల దాటిన సమయంలో కాసేపు ఆకాశంలో మబ్బులు కమ్ముకొని చినుకులు పడుతున్నాయి. ఆ సమయంలో మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతోపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈసారి ఎండలు ఎక్కువే....
మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు సెగలు కక్కుతుండగా .. జనం విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. గత ఏడాది మే మొదటి వారంలో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదైంది. ఈసారి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసినప్పటికీ గతంతో పోలిస్తే మరో డిగ్రీ పెరిగింది. దీంతో ఎవరి నోట విన్నా అమ్మ బాబోయ్..! ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు.
అకాల వర్షాలు...
ఈ సారి వేసవిలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండలు తీవ్రత ఒకవైపు ఉంటే .. మరోవైపు జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల చెట్లు కూలి పిడుగులు కూడా పడ్డాయి. ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, తదితర నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన స్వల్ప వర్షం కురిసింది. దీంతో కొన్నిచోట్ల ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరో వైపు మొక్కజొన్న, రబీ వరి, కంది, మిర్చి పంటలను సాగుచేస్తున్న రైతులకు అకాల వర్షాలతో నష్టాలు తప్పడం లేదు. పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.


