దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 49 వారికోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో కె.సునీల్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఐదు రోజులపాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు అమ్మవారికి విశేష అలంకారాలు, విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 11వ తేదీన చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరులలో గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం: ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించేందుకు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్(ఐఐటీ–జేఈఈ మెయిన్స్, ఎన్ఈఈటీ, ఎంసెట్) అందించనున్నట్లు వివరించారు. 250 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాల కోసం 6303325356, 8978452495 సంప్రదించాలని కోరారు.
తెనాలి: తెలంగాణ సారస్వత పరిషత్ ముద్రించిన బాల సాహితీ కథా సంకలనంలో పట్టణానికి చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీంజాని రచన ‘ప్రగతి పథం’ కథ ప్రచురితమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 180 కథలు రాగా వాటిలో ఎంపిక చేసిన 70 కథలతో ‘బాలసారస్వతం’ పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. వాతావరణ, జల కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలి, భూగర్భ జలాల్ని ఎలా పెంచుకోవాలి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి యువత ఎలా దోహదపడాలనే అంశాలపై ఈ కథనం రాశారు. హకీంజాని ఇప్పటి వరకు పిల్ల్లల కోసం 36 పుస్తకాలు, 290 కథలు రచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం హకీంజాని కథలను 2019లో 11వ తరగతికి, 2020లో 12వ తరగతికి పాఠ్యాంశాలుగా ప్రచురించింది.
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్ర చెస్ అసోసియేషన్, గుంటూరు చెస్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ పోటీలు 8వ తేదీ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సిహెచ్.రవీంద్ర రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని ఐడీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం రూ.50,000 నగదు బహుమతులు, మొమెంటోలు, సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. అండర్–7, అండర్–9, అండర్–11, అండర్–13, అండర్–15 విభాగాల్లోని వారికి ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 99481 98809 నంబర్ను సంప్రదించాలని కోరారు.


