నరసరావుపేట రూరల్: అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బుధవారం ఉదయం మండలంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమై 7.30 గంటల సమయంలో జల్లులు ప్రారంభమయ్యాయి. మిరప, మొక్కజొన్న రైతులకు వర్షం తీవ్రంగా నష్టం కలిగించింది. మూడవ విడత మిరప కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కల్లాల్లో పంట తడవకుండా రైతులు టార్పలిన్ పట్టలతో కప్పి ఉంచారు. దాదాపు గంటన్నరపాటు కురిసిన వర్షం కారణంగా పట్టలపైనా నీరు నిలిచింది. భారీ వర్షం కావడంతో కల్లాల్లోని మిరప పంటకు నిమ్ము చేరింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షంతో ఎకరానికి రూ.లక్ష మేర నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. వర్షం వలన తాలుగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే మద్దతు ధర లభించక ఆందోళన చెందుతున్న రైతులకు కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు పలుచోట్ల వర్షానికి తడిసింది. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలింది.


