84 వేల డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీ ప్రారంభం
నరసరావుపేట: జిల్లా వ్యాప్తంగా గురువారం స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో నకరికల్లు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వారం మహిళల ద్వారా కిచెన్ గార్డెన్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. మండలానికి 3 వేల మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా 84 వేల మంది డ్వాక్రా మహిళలకు విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామంలో ఔత్సాహికులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, డీఆర్డీఏ సిబ్బందితో విత్తనాల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంపై అవగాహన పెంచేందుకు టమోటా, పాలకూర, చుక్కకూర, తోటకూర, బెండ, గోరు చిక్కుడు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.


