నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి న్యూ కేటగిరి విభాగంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయని రైతు కమిటీ సభ్యులు తెలిపారు. నలుగురు వ్యక్తుల సహకారంతో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువు లాగినట్లు చెప్పారు.
ఆరు పళ్ల విభాగంలో విజేతలు..
గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఆరు పళ్ల విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 15 నిమిషాల వ్యవధిలో 1.200 టన్నుల బరువును ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన దేవరపల్లి జాన్వికా రెడ్డి, హన్విక ఎడ్ల జత 4,551 అడుగుల దూరం ప్రథమ స్థానంలో నిలిచాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన కొప్పుల గోవర్దన్ రెడ్డి, ప్రవలీష్ రెడ్డి ఎడ్ల జత 4,398 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామానికి చెందిన గడిపూడి రాజా చౌదరి ఎడ్ల జత 4,029 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్దశ్రీను, ఉమ్మనేని విక్రం, అత్తలూరి వెంకట్రావ్, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరుమామిళ్ల రాంబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.


