
తల్లులకు గుండెకోత
కూటమి సూపర్ సిక్స్ పథకాలు.. సాధారణ ఓటర్లను అమితంగా ఆకర్షించిన నినాదాలు. ప్రజలను ఆశల పల్లకీ ఎక్కించాయి. కూటమి పార్టీలకు ఓట్లను కురిపించాయి. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన వరాలను కురిపిస్తుందని ఎదురుతెన్నులు చూశారు. ఊరించి ఊరించి ఎట్టకేలకు ‘తల్లికి వందనం’ పథకం ఆర్థిక సాయాన్ని తల్లుల ఖాతాలకు జమ చేసింది ప్రభుత్వం. రకరకాల ఆంక్షలతో అర్హుల జాబితాలో పేర్లు ఎక్కని వారి సంగతి అటుంచి, ఖాతాలో జమచేసిన డబ్బులకు రెక్కలొస్తున్నాయి. రుణ బకాయిలున్న తల్లుల ఖాతాల్లో పడిన ‘తల్లికి వందనం’ ఆర్థికసాయాన్ని బ్యాంకులు బకాయిలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో తల్లులు గొల్లుమంటున్నారు.
తెనాలి: గతంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలనే భావనతో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. వాటి అమలుకు క్యాలెండరును ప్రకటించింది. ఆయా తేదీల్లో లబ్ధిదారులకు ఠంఛన్గా ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. అందులో అమ్మఒడి పథకం ఒకటి. పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలనే ఉద్దేశంతో దీన్ని రూపొంచింది. బిడ్డలను బడికి పంపే తల్లికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించింది. రూ.13 వేల చొప్పున నాలుగేళ్లు ఆర్థికసాయాన్ని అందజేసింది. మిగిలిన రెండు వేల రూపాయలను పాఠశాలల అభివృద్ధి, టాయ్లెట్ల నిర్వహణకు కేటాయించింది.
ఆశలు అడియాసలే..
‘తల్లికి వందనం’ పథకానికి అర్హులైన పలువురు తల్లుల పేర్లు అనర్హుల జాబితాలోకి ఎక్కాయి.
అదేమని ప్రశ్నిస్తే, గ్రీవెన్స్లో పెట్టుకోమని అధికారులు చెబుతున్నారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. ఈలోగా పలువురు లబ్ధిదారులకు తెలియకుండా వారి ఖాతాల్లో పడిన తల్లికి వందనం ఆర్థికసాయం ఖాళీ అవుతోంది. ఖాతాల్లోంచి డబ్బు మళ్లించిన మెసేజ్ రావటంతో పరుగు పరుగున బ్యాంకుకు వెళ్లిన లబ్ధిదారుల ఆశలు అడియాస అవుతున్నాయి. బకాయిలకు జమ చేసుకున్నామని బ్యాంకులు చెప్పిన మాటతో ఖిన్నులయ్యారు. టిడ్కో గృహాల రుణాల సహా వివిధ రుణాలకు సంబంధించిన బకాయిలున్న ఖాతాదారుల్లో ఎవరికై నా తల్లికి వందనం ఆర్థికసాయం ఖాతాల్లో జమ కావడం ఆలస్యం, సంబంధిత బ్యాంకులు వాటిని బకాయిల్లో జమ చేసుకుంటున్నాయి. ఒక బ్యాంకు అని కాకుండా దాదాపు అన్ని ఇదే తరహాలో వసూలు చేస్తున్నట్టు తెలిసింది. కనీసం ఖాతాదారుకు సమాచారం లేకుండానే వారి ఖాతాల్లో పడిన డబ్బులను మళ్లించుకుంటున్నాయి. బిడ్డలను చదివించుకోవాలని అనుకుంటున్న తల్లుల ఆశయానికి విఘాతం కలుగుతోంది.
ఆ చేత్తో ఇస్తూ...ఈ చేత్తో తీసేసుకుంటున్న ప్రభుత్వం ‘తల్లికి వందనం’ ఆర్థిక సాయాన్ని బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంకర్లు లబోదిబోమంటున్న లబ్ధిదారులు ఆర్థిక సాయం ప్రయోజనానికి విఘాతం
కూటమి నేతల సన్నాయి నొక్కులు
2024 ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు అమ్మఒడి సాయాన్ని తల్లికి వందనం పేరుతో ఇస్తామని ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఆ తల్లి ఖాతాలో జమచేస్తామని హామీనిచ్చారు. ఆయా పార్టీల కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో చదువుతున్న పిల్లల పేర్లు రాసుకుని, వారికి అంత మొత్తం ఏటా వస్తుందని నమ్మబలికారు. వారిలో ఆశలు రేపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. గత ఏడాదిగా సూపర్ సిక్స్ పథకాల్లో సామాజిక పింఛన్లు మినహా మిగిలిన వాటిని పక్కన పెట్టేశారు. అదేమంటే గల్లా పెట్టె ఖాళీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చారు. దీనిపై ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిలదీస్తుండటం, ప్రజల్లోనూ హామీలను అమలుచేయడం లేదన్న అసహనం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యాసంవత్సరం ఆరంభంలో తల్లికి వందనం ఆర్థికసాయాన్ని రూ.13 వేల చొప్పున ప్రభుత్వం తల్లుల జాబితాల్లో వేసింది.

తల్లులకు గుండెకోత