
సికిల్ సెల్ అనీమియా వ్యాధిని రూపుమాపుదాం
నరసరావుపేట రూరల్: అరుదైన జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియాను రూపుమాపేందుకు కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ కొద్ది మందికో వచ్చే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని గుర్తించి సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చనని తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిపై గురువారం పెదతురకపాలెం గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం, పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ అరుణ్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబులు పాల్గొని విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాధిపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జోత్న, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: సుపరిపాలన– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23న వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం సీఆర్డీఏ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ తేజ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ నవీన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ, డీటీ వసంతరావు పాల్గొన్నారు.
మహిళలపై పెరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు
లక్ష్మీపురం: రాష్ట్రంలోనూ, దేశంలోనూ మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు పెరిగాయని, వయస్సుతో సంబంధం లేకుండా హత్యలు జరుగుతున్నాయని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాలయంలోని మల్లయ్య లింగం భవన్లో రాజవరపు కోటేశ్వరమ్మ అధ్యక్షతన గురువారం మహిళా సమాఖ్య మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటాల కుమారి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రూపొందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహిళలు కూడా ఐక్యంగా పోరాట బాటలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. గొట్టిముక్కల దుర్గ నగర అధ్యక్షురాలిగా, గుండెబోయిన లక్ష్మి ప్రధాన కార్యదర్శిగా, 11 మంది కార్యవర్గం, 21 సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, చల్లా మరియా దాస్ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులకూ ‘తల్లికి వందనం’ ఇవ్వాలి
లక్ష్మీపురం: తల్లికి వందనం పథకాన్ని ఆప్కాస్లో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ వర్తింపజేయాలని సీపీఐ నగర కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. గుంటూరు వసంతరాయపురం మలేరియా డివిజన్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కార్మికులు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాల్యాద్రి మాట్లాడుతూ పథకాల అమలులో ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చిన్నచూపు చూడడం సరైనది కాదని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు మున్సిపల్ కార్మికులందరినీ లబ్ధిదారులుగా చేసి ఆదుకోవాలని కోరారు. ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ కార్మికుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.

సికిల్ సెల్ అనీమియా వ్యాధిని రూపుమాపుదాం

సికిల్ సెల్ అనీమియా వ్యాధిని రూపుమాపుదాం