
యోగా డే విజయవంతం చేద్దాం
నరసరావుపేట: ఈ నెల 21న జిల్లా అంతటా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నద్ధత, ఏర్పాట్లు, యోగా ట్రైనర్లకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల పంపిణీ, ఫేజ్–3 శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం వంటి అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యఅతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి కార్యక్రమం 10వేల మందితో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్, మరో 10వేల మందితో అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లావ్యాపంగా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో గుర్తించిన వేదికలలో నిర్వహించే యోగాంధ్రలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, సాధారణ ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. జిల్లాలో ఇంతవరకు యోగాంధ్రకు సుమారు 9.81లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్ఓ మురళి, జిల్లా అధికారులు డాక్టర్ రవి, ఎల్.చంద్రకళ పాల్గొన్నారు.
21న పరేడ్ గ్రౌండ్లో 10 వేల మందితో జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు