
అంతా అగమ్యగోచరం
రాజధాని నిర్మాణం
గుంటూరు రూరల్: రాజధాని నిర్మాణం అంతా అగమ్యగోచరంగా ఉందని వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నా రు. రాజధాని ప్రాంతానికి చెందిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, ముఖ్య నేతల సమావేశాన్ని గురువారం గుంటూరు రెడ్డిపాలెంలోని తన స్వగృహంలో నిర్వహించారు. మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ రాజధానిలో నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఎప్పటిలోగా అందజేస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయని, వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన పేదలకు తిరిగి భూములు ఇస్తారా? ఇస్తే ఎక్కడ ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సీఆర్డీఏ, ఎంఏయూడీ అఖిలపక్షాన్ని పిలిచి, రాజధాని ప్రాంతంలో పరిస్థితులు, జరుగుతున్న పనులను వివరించాలని డిమాడ్ చేశారు. సీఆర్డీఏ తీసుకున్న రుణాలపై శ్వేతపత్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. రైతులకు కౌలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలోని జగనన్న కాలనీలను రద్దు చేశారు కాబట్టి వారికి వేరే ప్రాంతంలో భూములు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డెప్యూటీ మేయర్ బాలవజ్రబాబు, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, మందపాటి శేషగిరిరావు, దంటు బాలాజీరెడ్డి పాల్గొన్నారు.
గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల