
చైన్ స్నాచింగ్ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్టు
నగరంపాలెం: ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే పాత నేరస్తుడ్ని గుంటూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. అతని నుంచి రూ.30 లక్షలు ఖరీదైన 300 గ్రాముల నగలు, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలుల్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి గత నెల 28 వరకు జిల్లాలో వరుస బంగారు గొలుసు చోరీలు జరిగాయని తెలిపారు. దీంతో సీసీఎస్ సీఐలు అనురాధ, అల్తాఫ్ హుస్సేన్, బి.శ్రీనివాస్తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 700 నిఘా కెమెరాలను నిశితంగా పరిశీలించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో ఆనందపేట ఒకటో వీధిలో ఉంటున్న నలభై ఏళ్ల షేక్ అమీర్బేగ్ అలియాస్ జోహారీని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొ న్నారు. గతంలో జరిగిన ఎనిమిది బంగారు గొలుసు దొంగతనాలకు ఇతడే పాల్పడినట్లు విచారణలో గుర్తించామని వివరించారు. అమీర్ బేగ్ను అరెస్ట్ చేసి బంగారు నగలు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో రెండు బైక్లను గుర్తించాలని చెప్పా రు. కేసులను త్వరితగతిన ఛేదించిన ఏఎస్పీ క్రైం సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు.
15 రోజులకు ఒక చోరీ
పెయింటర్గా పనిచేసే అమీర్ బేగ్ ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో మంచి నేర్పరి. 2006లో మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నాడు. 2014లో పాత గుంటూరు పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. అతనిపై 2016లో పాత గుంటూరు పీఎస్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అప్పటికే సుమారు 22 కేసులు నమోదవ్వగా, ఇటీవల చేసిన ఎనిమిది కేసులతో 30 వరకు నమోదయ్యాయి. పదిహేను రోజులకు ఒకసారి రెక్కీ చేసేవాడని, అది కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేసేవాడని పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లా వెళ్లి అక్కడ తాళం అరిగిపోయిన బైక్లను దొంగలించి, ఇక్కడికి వచ్చేవాడని చెప్పారు. చోరీలు చేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడే వాటిని వదిలేసి వెళ్లేవాడని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు జె.అనురాధ, ఎండీ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్, బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం పీఎస్ సీఐ జి.వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
రూ.30 లక్షల విలువైన
బంగారు నగలు స్వాధీనం