గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించటం జరుగు తోందని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి సోమవారం తెలిపా రు. జాతీయ లోక్ అదాలత్లో గుంటూరు జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిన సర్కులర్ ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎక్సైజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించటం జరుగుతుందన్నారు. కక్షిదారులు, పోలీస్శాఖ, స్టేక్ హోల్డర్స్ ఈ జాతీయ లోక్ అదాలత్ ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలని సూచించారు. సివిల్ కేసుల్లో అప్పీల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా కక్షిదారులకు, న్యాయవాదులకు సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆర్టీసీ ఆర్ఎంగా విమల
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : ఏపీఎస్ ఆర్టీసీ గుంటూరు జిల్లా రీజియన్ మేనేజర్గా సీహెచ్.విమల సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న ఆమెను ఇక్కడ నియమించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్ఎంగా పనిచేసిన ఎం.రవికాంత్ డెప్యూటీ సీటీఎంగా బదిలీపై నెల్లూరు వెళ్లారు. విమలను ఆర్టీసీ సిబ్బంది, అధికారులు అభినందించారు.
ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో డాక్టర్ సత్యవేణికి 12వ ర్యాంకు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల ప్రకటించిన ఆల్ ఇండియా ఎయిమ్స్ సర్జికల్ అంకాలజీ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డాక్టర్ సత్యవేణి జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. డాక్టర్ సత్యవేణి విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం నిమ్రా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త డాక్టర్ మాచర్ల సృష్టి కూడా జాతీయ స్థాయిలో జరిగిన నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి బెంగళూరులోని శ్రీ జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్స్ అండ్ రీసెర్చ్లో వాస్కులర్ సర్జరీ(ఎంసీహెచ్)లో ప్రవేశం పొందారు.
21న యోగాసనాల్లో అందరూ పాల్గొనాలి
గుంటూరు వెస్ట్: ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న యోగాసనాల్లో వీలైనంత మంది పాల్గొనేలా చేయాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఆయన చాంబర్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడుతూ యోగాసనాలు వేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో గుర్తించిన 4879 ప్రాంతాలను అధికారులు పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. యోగాంధ్ర–2025లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరినీ 21న జరగనున్న కార్యక్రమంలో హాజరయ్యేలా అధికా రు లు సమన్వయం చేసుకోవాలన్నారు. యోగాసనాల శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
31వరకు అతిసారం నియంత్రణపై ప్రచారం
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు అతిసార వ్యాధి నియంత్రణపై ప్రచారం నిర్వహించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. తన కార్యాలయంలో సోమవారం ప్రచారానికి సంబంధించిన వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఐదేళ్లలోపు పిల్లలు అతిసారతో మృత్యువాత పడ కుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశమన్నా రు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బి.గీతాంజలి పాల్గొన్నారు.