
తల్లికి వందనం అమలులో అంగన్వాడీలకు అన్యాయం
నరసరావుపేట: అంగన్వాడీలకు తల్లికి వందనం అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందనీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మెటిల్డాదేవి, గుంటూరు మల్లీశ్వరి పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయలునాయక్ నాయకత్వంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తమకు తల్లికి వందనంతోపాటు ఇతర సంక్షేమ పథకాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.అరుణ్బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మెటిల్డాదేవి, మల్లీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీలకు అమ్మ ఒడి అందజేసిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు అన్నీ సంక్షేమ పథకాలు అమలుచేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిందన్నారు. తీరా తల్లికి వందనం అంగన్వాడీలకు అమలుచేయకపోవటంతో చాలా మంది టీచర్లు, ఆయాలు రోధిస్తున్నారన్నారు. నెలకు రూ.11వేల జీతం ఇచ్చి సంక్షేమ పథకాలకు ఎగనామం పెడితే ఏవిధంగా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక వేళ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తే తమకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలు అందజేయాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని జిల్లా కార్యదర్శి ఆంజనేయులు నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీలు యంపరాల సరోజ, కట్టా నాగలక్ష్మి, కోట కోటేశ్వరమ్మ, పేరేచర్ల సాంబ్రాజ్యం, ఉప్పుతోళ్ల వెంకాయమ్మ, కటకం కృష్ణవేణి, మల్లెల శశికళ, వనజాక్షి పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
వెంటనే సంక్షేమ పథకాలు అమలుచేయాలి
లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ముట్టడిస్తాం
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీలు