
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి
ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ, కుటుంబానికి పరామర్శ
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి
జగన్ పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రానున్నారని, ఆ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి పిలుపునిచ్చారు.
పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. సుధీర్భార్గవ్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సమయంలో సత్తెనపల్లి రూరల్ పోలీసుల వేధింపులు, కూటమి నేతల దాడుల నేపథ్యంలో మనస్తాపం చెందిన రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమలేశ్వరరావు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడన్నారు.
రెంటపాళ్ల గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్నివ్వడంతోపాటు భరోసా కల్పించి ఆయన కాంస్య విగ్రహావిష్కరణను జగన్మోహన్రెడ్డి చేస్తారన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు మీదుగా సత్తెనపల్లి చేరుకుంటారని, అనంతరం సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకుంటారన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి టౌన్, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల నుంచి పెద్దఎత్తున వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.