
భూసార పరీక్షలు చేయించుకోవాలి
అచ్చంపేట: ఖరీఫ్కు ముందే వేసవి దుక్కులు దున్ని భూములను సిద్ధంగా ఉంచుకోవాలని, భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో పి.వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోనూరు, కస్తలలో మంగళవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షల ఫలితాలను బట్టి ఎరువులు వాడాలని చెప్పారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనము, పిల్లిపెసర విత్తనాలు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని, విక్రయ కేంద్రాల నుంచి తప్పనిసరిగా బిల్లులు తీసుకుని పంట కాలం పూర్తయ్యేవరకు వాటిని భద్రపరచుకోవాలన్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
రెండు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
లంకెలకూరపాడు(ముప్పాళ్ళ): మండలంలోని లంకెలకూరపాడు, చాగంటివారిపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బీవీ నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం వరి, మిరప, పత్తి పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పైరులు సాగు చేసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రంలో భూ యజమానుల అంగీకారంతో పంట సాగు హక్కు పత్రం పొందవచ్చన్నారు. అన్నదాత సుఖీభవ పథకంకు అర్హత కలిగిన రైతుల వివరాలు ప్రభుత్వం ఈ కేవైసీ ఆటో అప్డేట్ చేయటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది శైలజ, సుభాని, రైతులు పాల్గొన్నారు.

భూసార పరీక్షలు చేయించుకోవాలి