
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి
క్రోసూరు: మహిళా సంఘం ఆధ్వర్యంలో క్రోసూరులోని గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల అభివృద్ధి అధికారి, పంచాయితీ సిబ్బందికి మంగళవారం స్థానిక పలు కాలనీల మహిళలు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని ఎనిమిదో వార్డుకు చెందిన కొత్తూరు బజారు నివాసితులు పంచాయతీ అధికారి ఆదినారాయణతో మాట్లాడుతూ తమ ప్రాంతంలోని బోరు బావులన్నీ ఎండిపోయాయని తెలిపారు. రోజు వారి నీటి అవసరాలకు చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది ఆదినారాయణ ప్రతి రోజు నీటిని అందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మహిళా సంఘం క్రోసూరు మండల బాధ్యులు వి.అనూష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ప్రకటించి ఆరు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అమల్లోకి రాకపోవడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో తిమ్మిసెట్టి హనుమంతరావు, షేక్ జాన్ బీ, షేక్ బుజ్జి, నిమ్మకాయల గాంధీ, షేక్ ఖాసింబి, షేక్ హుస్సేన్బీ, షేక్ సైదాబీ, ముజార్ అల్లాబీ, మొజార్ ధరియాబీ పాల్గొన్నారు.