
ఏటీఎం మోడల్ సాగుతో నిరంతర ఆదాయం
రాజుపాలెం: ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏటీఎం మోడల్లో సాగు చేస్తే రైతులు 365 రోజులు నిరంతర ఆదాయం పొందవచ్చని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ఎన్ఎఫ్ఏ అప్పలరాజు తెలిపారు. మండలంలోని బలిజేపల్లి, కొత్తపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం రైతు గాలం జయసింహారావు పొలంలో ఏటీఎం మోడల్ విధానాన్ని మంగళవారం వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధానంలో ముందుగా భూమిని చదును చేసి నాలుగు అడుగుల వెడల్పు బెడ్లుగా ఒక అడుగు నీటి కాలువులుగా ఏర్పాటు చేసి ఆ బెడ్లపై 18 రకాల దుంప, తీగ ఆకుకూరలు, కూరగాయలు, బోర్డర్ క్రాఫ్గా మొక్కజొన్న వేయడం జరిగిందని తెలిపారు. ఏటీఎం మోడల్లో ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బలిజేపల్లి యూనిట్ ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, ఐసీఆర్పీలు అంకమ్మరావు, యలమందమ్మ, తిరుపతమ్మ, నరసింహారావు, జ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.