
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మోదీదే
అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ను ప్రధాని నరేంద్రమోదీ తన 11 ఏళ్ల పాలనతో అభివృద్ధి చెందిన దేశంగా మార్చారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, కోస్తాంధ్ర ఇన్చార్జి సన్నారెడ్డి దయాకరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఏవీఆర్ కల్యాణ మండపంలో నిర్వహిహించిన పెదకూరపాడు నియోజకవర్గ బీజేపీ వికసిత్భారత్ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆలోకం సుధాకరబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దయాకరరెడ్డి మాట్లాడుతూ 11 ఏళ్ల బీజేపీ పాలనలో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేయటం జరిగిందన్నారు. అలాగే రైతులు, పేదల కోసం ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం స్వనిధి యోజన, అలాగే మహిళల కోసం పీఎం మాతృవందన, ఆరోగ్యానికి ఆయుష్మాన్ భారత్ వంటి అనేక పథకాలు అమలు చేశారన్నారు. దేశ భద్రతకు పటిష్టమైన విదేశాంగ విధానంతో పాటు రక్షణ రంగంలో ఆయుధ సంపత్తిని సమకూర్చారన్నారు. ఇలా 11 సంవత్సరాలలో మోదీ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగు స్థానానికి చేర్చారన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ విధానాలను, బీజేపీ ఆశయాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పల్నాడు జిల్లా బీజేపీ అధక్షుడు శశికుమార్, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మేకల హనుమంతరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఇంటింటికీ అందించాల్సిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.