సముద్రాన్ని మింగేసిన పచ్చనేత | - | Sakshi
Sakshi News home page

సముద్రాన్ని మింగేసిన పచ్చనేత

Jun 18 2025 3:39 AM | Updated on Jun 18 2025 3:39 AM

సముద్

సముద్రాన్ని మింగేసిన పచ్చనేత

సాక్షి ప్రతినిధి,బాపట్ల: బాపట్ల మండలం దానవాయిపేట వద్ద సముద్రంలో కలుస్తున్న ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ను సీ మౌత్‌ వద్ద పచ్చనేత, రియల్టర్‌ బుర్ల వెంకటరావు, (ఈయన టీడీపీ రైతువిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావుకు స్వయాన వియ్యంకుడు) గుంటూరుకు చెందిన మరో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కలిసి ఆక్రమించారు. ఏకంగా సముద్రంలోకి కర్వు(వంపుగా) తిరిగే ఈ ప్రధాన కాలువ మొత్తాన్ని పూడ్చివేశారు. కాలువ తిరిగి అటువైపునకు రాకుండా పెద్ద పెద్ద కొండరాళ్లను తెచ్చి అడ్డుగా కట్టకట్టారు. కిలోమీటరు పొడవున ప్రవహించే కాలువను చిన్నపిల్ల కాలువగా సముద్రంలోకి వెళ్లేలా స్ట్రయిట్‌గా తరలించారు. పాతకాలువను కిలోమీటరు మేర మొత్తం పూడ్చివేసి దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం మొత్తాన్ని ఆక్రమించి చదును చేశారు. ఇక్కడ వెంచర్‌ వేసి అమ్మకం పెట్టడంతోపాటు రిసార్ట్‌లు నిర్మించేందుకు పనులు వేగవంతం చేశారు. రియల్టర్‌ బుర్ల వెంకటరావు ఆ స్థలంలో ఏకంగా గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. ఈ ప్రాంతంలో ఎకరం విలువ సగటున రూ.5 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన ఆక్రమణ భూమి విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. కబ్జా చేసిన మొత్తం 10 ఎకరాలలో ఇప్పటికే 3.42 ఎకరాలు, 1.50 ఎకరాలు చొప్పున రెండు భాగాలుగా డీకేటీ పట్టాలు కూడా పొందినట్లు సమాచారం. మిగిలిన ఆక్రమణ భూమికి కూడా డీకేటీలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం బాపట్ల రెవెన్యూ అధికారులకు రూ. కోట్లలోనే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు సైతం పెద్ద ఎత్తున ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బోట్లకు తీవ్ర నష్టం

ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌(ప్రధాన కాలువ) సీ మౌత్‌ సముద్రానికి దాదాపు కిలోమీటరు దూరం నుంచి ఎడమ వైపుకు వంపుగా తిరిగి సముద్రంలో కలుస్తుంది.

దీనివల్ల సముద్రం నుంచి వచ్చే పోటు వల్ల కాలువలో నిలుపుకునే సుమారు 2 వేల బోట్లకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే స్ట్రయిట్‌గా సముద్రంలోకి కాలువ వెళితే పోటు సమయంలో అలల ఉధృతికి బోట్లు ఒకదానికొకటి కొట్టుకొని పగిలి పోతాయి. దీనివల్ల తీవ్రం నష్టం కలుగుతుందని మత్స్యకారులు వాపోయారు. తమ జీవనభృతినే దెబ్బతీసే ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కరాఖండిగా చెపుతున్నారు. ఆక్రమణదారులతో అధికారులు చేతులు కలిపి తమకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే ఎంతవరకై నా వెళతామని మత్స్యకారులు హెచ్చరించారు.

ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌ సీ మౌత్‌ కాలువను పూడ్చిన పచ్చనేత తద్వారా 10 ఎకరాల తీరం భూమి ఆక్రమణ ఎకరం రూ.5 కోట్లు చొప్పున మొత్తం భూమి విలువ రూ.50 కోట్లు ముడుపులు పుచ్చుకొని కొంత భూమికి పట్టాలిచ్చిన అధికారులు మిగిలిన ఆక్రమణకు డీకేటీలు సిద్ధం స్ట్రయిట్‌ కట్‌ పూడ్చడంతో కాలువలోనే 2 వేల పడవలు నిషేధం ముగిసి రెండు రోజులు దాటినా వేటకు వెళ్లలేని మత్స్యకారులు పనులను అడ్డుకున్న 9 గ్రామాల మత్స్యకారులు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న మత్స్యకారులు

రియల్టర్‌తో ఎమ్మెల్యే మంతనాలు

ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌ ఆక్రమణ గొడవ విషయం తెలుసుకున్న బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ హుటావుటిన వెళ్లి రియల్టర్‌ వెంకటరావును కలిసి ఆయన అతిథి గృహంలో మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

బుర్ల వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలి

బాపట్లటౌన్‌: సముద్రపు అంచున బండరాళ్లతో అడ్డుకట్ట వేస్తున్న బుర్ల వెంకట్రావుపై చట్టప్రకా రం చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన మంతెన కరుణరాజు మంగళవారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితుడి కథనం మేరకు.. బాపట్ల మండలం పాండురంగాపురం పంచాయతీ పరిధిలోని అడవిపల్లిపాలెం సమీపంలో తనకు 13 ఎకరాల నాన్‌ అగ్రికల్చరల్‌ భూమి ఉందని, నా భూమికి పడమర వైపున చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామానికి చెందిన బుర్ల వెంకట్రావుకు పొలం ఉంది. అయితే నిబంధనలకు విరుద్దంగా వెంకట్రావు పెద్దపెద్ద కొండరాళ్లతో సముద్రపు నీరు బయటకు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని, ఇదేమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నారని అన్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సముద్రాన్ని మింగేసిన పచ్చనేత1
1/2

సముద్రాన్ని మింగేసిన పచ్చనేత

సముద్రాన్ని మింగేసిన పచ్చనేత2
2/2

సముద్రాన్ని మింగేసిన పచ్చనేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement