కూటమి ఏడాది పాలనపై చర్చకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కూటమి ఏడాది పాలనపై చర్చకు సిద్ధం

Jun 17 2025 5:40 AM | Updated on Jun 17 2025 5:40 AM

కూటమి ఏడాది పాలనపై చర్చకు సిద్ధం

కూటమి ఏడాది పాలనపై చర్చకు సిద్ధం

● వైఎస్సార్‌ సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్‌రెడ్డి సవాల్‌ ● నరసరావుపేటలో వారం, పదిరోజుల్లో టీడీపీ నేతలు చర్చకు రావాలి ● కూటమి ఏడాది పాలనపై వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరణ ● మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, కాసు మహేష్‌, నాయకులు ● వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటన జయప్రదం చేయాలని పిలుపు

నరసరావుపేట: కూటమి ప్రభుత్వ ఏడాది మోసపు పాలన, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వ నిజాయతీ పాలనపై నరసరావుపేటలో టీడీపీ నేతలు, మంత్రులు ఒకవారం లేదా పదిరోజుల్లో చర్చకు రావాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతమ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ చర్చకు తనతోపాటు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని ఏడాది పాలన ఫెయిల్యూర్‌ తెలియచేస్తామని, దమ్ముంటే టీడీపీ నేతలు ఎవరైనా రావొచ్చని అన్నారు. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్‌, జగన్‌మోహన్‌రెడ్డి పాలనను బేరీజు వేస్తూ వెన్నుపోటు అనే పేరుతో ముద్రించిన జగన్‌ నమ్మకం, చంద్రబాబు మోసం పుస్తకాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. దీనిలో మాజీమంత్రి విడదల రజిని, నరసరావుపేట, గురజాల మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డిలతోపాటు పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదిగా అరాచకం, అప్రజాస్వామిక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తల్లికి వందనం పథకం లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అందలేదని తాము నిరూపించగలమని అన్నారు. విద్యుత్‌ చార్జీలు వీరబాధుడుగా ఉన్నాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కేవలం యూనిట్‌ రూ.2లకే కొంటే గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదే కరెంటును రూ.4.50కి కొన్నాడన్నారు. 159 పేజీల ఈ బుక్‌లో జగన్‌మోహనరెడ్డి నిజాయతీ, చంద్రబాబు ఫెయిల్యూర్‌ తెలియచేశామన్నారు. సత్తెనపల్లిలో అశువులు బాసిన వైఎస్సార్‌సీపీ నాయకుడి విగ్రహావిష్కరణకు జగన్‌మోహన్‌రెడ్డి చేసే పర్యటన శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అసమర్ధ, అరాచకాలను ఎండగట్టాలని గౌతంరెడ్డి కోరారు.

రాష్ట్రంలో అసలు హోం మంత్రి ఉన్నారా..?

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో 769 మంది వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యలు, దాడులు, కేసులు పెట్టి వేధించారన్నారు. 260 మంది చనిపోయారని అన్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట మూడేళ్ల బాలిక దగ్గర నుంచి 35 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఇప్పటివరకు 188 మందిపై చోటుచేసుకున్నాయని చెప్పారు. దీనిని బట్టి హోం మంత్రి పనిచేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. 139మంది సోషల్‌మీడియా యాక్టివిస్టులపై 729 కేసులు పెట్టారని చెప్పారు.

చంద్రబాబు తన ఆస్తులు పంచి చూపించాలి

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఆరోగ్యశ్రీ చెల్లింపులు కేవలం ఒక నెలకే ఇచ్చారన్నారు. ప్రతి మహిళకు రూ.15వేలు ఇస్తామని చెప్పి పీ4కు అప్పచెప్పామని చెబుతున్నామన్నారు. చంద్రబాబుకు రూ.50వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని, వాటిని 50వేల కుటుంబాలకు పంచితే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులవుతారని అన్నారు. ఇది ఆయన అమలుచేసి మిగతా వారికి మార్గదర్శం కావాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అప్పులకు ఒక లెక్క ఉందని, చంద్రబాబు చేసే అప్పులకు లేక్కేలేదని అన్నారు. యొనుముల మురళీధర్‌రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

జగన్‌ పాలనలో ప్రతి సామాన్యుడికి మంచి జరిగింది

మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలు, విద్యార్థులకు, రైతులు, ప్రతి సామాన్యుడికి మంచి జరిగిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి భద్రత లేకుండా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం దారుణాలను ప్రశ్నించటానికే జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాలకు వస్తున్నారని, సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు జగన్‌ వస్తున్నాడని, ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement