
25న ‘ఏపీ గురుకులాల’ ప్రవేశ పరీక్ష
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీన ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్–2025 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు సెట్ పల్నాడు జిల్లా కో–ఆర్డినేటర్ ఎన్.సరోజిని మంగళవారం తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 944మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు తెలిపారు. వీరికి శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్, హిందూ స్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్ష 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు 7 పరీక్షా కేంద్రాలలో 1,706మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. వీరికి శంకరభారతీపురం జడ్పీ హైస్కూల్, హిందూ స్కూల్, సెయింట్ మేరీస్ హైస్కూల్, మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, ఆక్స్ఫర్డ్ హైస్కూల్, శ్రీకృష్ణ చైతన్య హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన
వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పోలేరమ్మ వారి
వార్షికోత్సవాలు
తెనాలి: స్థానిక వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని శ్రీ పోలేరమ్మ వారి ఆలయం 27వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం విశేష పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, విశేష అలంకరణతో మేళతాళాలు, కాళికా వేషం, భాజా భజంత్రీలతో తెనాలి పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త వీరయ్య, గుంటి వెంకట్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. బుధవారం ఉదయం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై చర్చకు వినతి
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లో అసోసియేషన్ నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్ల సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. జేఎస్సీ సమావేశం ఏర్పాటుతో అనేక అంశాలు చర్చించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

25న ‘ఏపీ గురుకులాల’ ప్రవేశ పరీక్ష

25న ‘ఏపీ గురుకులాల’ ప్రవేశ పరీక్ష