భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులపాటు ఉత్తర, కోస్తా ఒడిశా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎమ్డీ తెలిపింది. ఆదివారం సూర్యోదయం నుంచి రాష్ట్ర రాజధానిలో వర్షం కురుస్తూనే ఉంది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అసాధారణమైన చీకటి అలుముకుంది. ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) రాబోయే 4 రోజుల కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ వ్యవధిలో బాలేశ్వర్, భద్రక్, కేంద్రాపడా, మయూర్భంజ్ జిల్లాలకు ఐఎమ్డీ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జగత్సింగ్పూర్, జాజ్పూర్, అనుగోల, కెందుఝర్, కటక్ మరియు ఢెంనాల్ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.
నేటి వాతావరణ సూచన
సోమవారం బరగఢ్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ వా ర్నింగు జారీ చేశారు.
ఆరెంజ్ హెచ్చరిక
సుందర్గఢ్, ఝార్సుగుడ, సంబల్పూర్, దేవ్గడ్, అంగోలా, కెందుఝర్, సుబర్ణపూర్, నువాపడా, బొలంగీర్ మరియు కలహండి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
పసుపు హెచ్చరిక
బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, ఢెంకనాల్, మయూర్భంజ్, బౌధ్, కంధమల్, నబరంగ్పూర్, రాయగడ మీదుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాలేశ్వర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, ఢెంకనాల్, మయూర్భంజ్, బౌధ్, కంధమల్, నవరంగ్పూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, గజపతి, పూరీ, ఖుర్దా, నయాగడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.


