● బాలాసోర్లో వరద ముప్పు
భువనేశ్వర్: బాలాసోర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సువర్ణ రేఖ నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. మరో వరద ముప్పు పొంచి ఉంది. రెండో వరద తగ్గిన 14 రోజుల లోపే మూడో వరద వచ్చే అవకాశం ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. జార్ఖండ్లోని గలుడిహ్ బ్యారేజీ 6 గేట్లను తెరవడంతో దిగువన ప్రవహిస్తున్న సువర్ణ రేఖ నది నీటి మట్టం అనుక్షణం పెరుగుతుంది. పరిస్థితి మరింత తీవ్రమైతే జలేశ్వర్, భొగరాయ్, బలియాపాల్ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు మళ్లీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.
తాజా వరద ముప్పు
సువర్ణ రేఖ నది ప్రమాద స్థాయి 10.36 మీటర్లు కాగా ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి దాని నీటి మట్టం 8.84 మీటర్లుగా నమోదైంది. గత వరద సమయంలో అనేక గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు నీట మునిగిపోయాయి. పలు చోట్ల రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. గత వరదల వల్ల కలిగిన నష్టాల నుంచి కోలుకోవడానికి రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వరదలు వస్తే తమ కష్టాలు మరింత తీవ్రం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. నది నీటి మట్టం మరింత పెరిగితే, బలహీన ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వ్యవసాయ భూములపై కూడా ప్రభావం పడవచ్చు. మూడో వరద సంభవిస్తే అంతా నాశనమవుతుందని, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవచ్చని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


