భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవా రం తీవ్ర వేసవి తాపం కొనసాగింది. పశ్చిమ, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లోని పలుచోట్ల ఉష్ణోగ్ర త 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 40.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతతో టిట్లాగఢ్ అత్యధిక వేడిమి ప్రదేశంగా నిలిచింది. బొలంగీర్లో 40.2, సంబల్పూర్లో 40.1, భవానీపట్నలో 40, ఝార్సుగుడలో 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో 37.3 డిగ్రీల సెల్సియస్, కటక్లో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది లా ఉండగా.. మెరుపులు, బలమైన గాలులు, ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తీరప్రాంత, ఉత్తర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించిన పశ్చిమ ఒడిశాలో వేడి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ సమాచారం.
పసుపు హెచ్చరిక..
పలు చోట్ల గురువారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కెంజొహర్, మయూర్భంజ్, కేంద్రాపడా, అంగుల్, ఢెంకనాల్, కటక్, పూరీ, జగత్సింగ్పూర్, ఖుర్దా, నయాగఢ్, గంజాం, గజపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.


