ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ హరినాథ్
అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈఓ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు వేదమంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరిబాబు, ప్రోటోకాల్ న్యాయమూర్తి అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హరినాథ్ నూనేపల్లి సతీసమేతంగా శనివారం దర్శించుకున్నారు. అర్చకులు లక్ష్మణాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు క్షేత్ర వైభవాన్ని వివరించి స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
రసాయనం చోరీపై కేసు
రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఆపీటోరియా పరిశ్రమలో ముగ్గురు వ్యక్తులు రూ.6 లక్షలు విలువైన ఇథైల్ అసిటేట్ రసాయన లిక్విడ్ దొంగిలించినట్లు పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. ఈ నెల 19న పూణే నుంచి వచ్చిన జూబిలెంట్ ఇంగ్రేవియా ట్యాంకర్ అన్లోడ్ అనంతరం తిరుగు వెళుతున్న సమయంలో మరో స్థలంలో 8235 కిలోల బరువు అద నంగా లోడ్ చేయడంతో ట్యాంకర్ తూకంలో వచ్చిన వ్యత్యాసం వచ్చింది. చోరీ జరిగినట్లు గుర్తించిన పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
కొత్తూరు(పాతపట్నం): శాసనమండలి ప్రతిపక్ష నేత, సీనియర్ బీసీ నాయకుడు బొత్స సత్యనారాయణపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. శనివారం కొత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూస్తుంటే, వారికి బీసీలంటే ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోందన్నారు. కూటమి నాయకులు అధికార మదంతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగడం దారుణమన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ మద్దతుదారులు చేసిన దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
అరసవల్లి: మన ఇళ్లతో పాటు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా మూడో శనివారం సందర్భంగా డీఎంహెచ్వో కార్యాలయ ఆవరణలో చెత్తను శుభ్రం చేశారు. కార్యక్రమంలో డెమో విభాగాధికారి ఎర్రన్న, హెల్త్ ఎడ్యుకేటర్ విజయలక్ష్మి, మోహిని పాల్గొన్నారు.
పోరాట వ్యక్తులే టార్గెట్!
రణస్థలం: రణస్థలం పంచాయతీ నగరప్పాలెం గ్రామంలో రవికిరణ్ బ్రేవరేజెస్ ప్లాంట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తులపై పోలీసుల వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఆరు నెలలుగా ప్లాంట్కు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామపెద్దలు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ యాజమాన్యం నుంచి మామూళ్లు అందుకున్న ‘కొందరు’ ఉద్యమాన్ని నీరుగార్చేలా గ్రామస్తులను మూడు పార్టీలుగా విభజించారు. ఈ క్రమంలో బెదిరిస్తే లొంగుతారని తొలుత ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అప్పటికీ తగ్గకపోవడంతో నిరసన తెలుపుతున్నారనే నెపంతో మరో 13 మందిపై కేసులు పెట్టారు. మొత్తం 18 మందిపై కేసులు నమోదు కావడంతో ఉద్యమం చెల్లాచెదురైపోయింది. అయినప్పటికీ ఓ యువకుడు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పరిశ్రమకు వ్యతిరేకంగా మెసేజ్లు పెడుతున్నాడని కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. అందరూ సైలెంట్గా ఉన్న సమయంలో మళ్లీ మెసేజ్లు పెట్టి రెచ్చగొడుతున్నావంటూ సదరు యువకుడిని శనివారం పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఉదయం నుంచి స్టేషన్లోనే ఉంచేశారు. ఈ సమాచారం బయట వ్యక్తులకు చెబుతున్నాడనే అక్కసుతో ఫోన్ సైతం లాక్కున్నట్లు తెలిసింది. ఇంతలో గ్రామపెద్దలు స్టేషన్కు చేరుకోవడంతో యువకుడిని అరగంటలో పంపించేస్తామని చెప్పి రాత్రి 8 గంటల వరకు ఉంచేశారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో చివరకు విడిచిపెట్టారు. ఈ విషయమై జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పరిశ్రమకు సంబంధించి కేసు నడుస్తోందని, మరో ఫిర్యాదు కూడా ఉందన్నారు. యువకుడిని కేసు విచారణ నిమిత్తం తీసు కొచ్చామని, విచారణలో భాగంగా పిలుస్తామని స్పష్టం చేశారు.
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు జడ్జి జస్టిస్ హరినాథ్


