
మహిళలకు రక్షణ లేదు
● వోపీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్
భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ విచారం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల అంశంపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సమయం ఇవ్వలేదు, ఫోను సంప్రదింపులకు స్పందించ లేదు. లేఖలకు ఆయన సమాధానం ఇవ్వలేదని భక్త చరణ్ దాస్ అన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయబోమని అయితే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండదని.. సమస్య పరిష్కారం అయ్యేవరకూ పోరాడుతామన్నారు.
–రాష్ట్రపతి దృష్టికి సమస్య..
మహిళల పట్ల అత్యాచారాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రంలో పరిస్థితిని వివరించాలని భావిస్తోంది. గంజాం జిల్లా గోపాల్పూర్, కంధమల్ జిల్లా టికాబలి, కెంజొహర్ జిల్లా హరిచందన్పూర్ ప్రాంతాలలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలపై నిజ నిర్ధారణ కమిటీ నేరుగా వెళ్లి ఆరా తీసింది.. పర్యటన చివరి రోజున స్థానిక కాంగ్రెస్ భవనన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దాస్ మున్సి మాట్లాడుతూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు కమిటీ నిజ నిర్ధారణ నివేదికను సమర్పిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళల భద్రత కోసం సమయం లేనందున రాష్ట్రంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను ఢిల్లీ స్థాయిలో లేవనేత్తుతామన్నారు.