
బీజేడీ శ్రేణుల ఆందోళన
కొరాపుట్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందంటూ కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లోని విద్యాలయాల ఎదుట బీజేడీ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆ పార్టీ యువజన విభాగం బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో కూడా ఆందోళనలు జరగ్గా.. సంఘీభావంగా పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఆందోళను చేపట్టారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళనలో ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి మాట్లాడుతూ.. అమెరికా వంటి దేశం తమ పౌరులలో మహిళలను ఒడిశా వెళ్లవద్దని హెచ్చరికలు చేసిన దుస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొందన్నారు. ఆందోళనలో డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, తపస్ త్రిపాఠి, మంజులా మజ్జి పాల్గొన్నారు. కొరాపుట్ డీఏవీ కళాశాల మందు జరిగిన ఆందోళనలో జెడ్పీ ప్రెసిడెంట్ సస్మిత మెలక, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మున్సిపల్ చైర్మన్ లలిల్ శెఠి హాజరయ్యారు. జయపూర్లోని విక్రందేవ్ యునివర్సిటీ, డాబుగాం, ఉమ్మర్ కోట్లలో జరిగిన ఆందోళనలో బీజేడీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: స్థానిక అటానమస్ కళాశాల మెయిన్ గేట్ వద్ద బుధవారం బీజేడీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిప్పులు చెరిగాయి. బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు కనీస రక్షణ కరువయ్యిందని దుమ్మెత్తి పోశాయి. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి దిష్టిబొమ్మను దహనంచేశారు. తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేడీ యువ నాయకులు వినోద్ పొలాయ్, అవినాష్ బిసొయ్, సంతోష్ దొళాయి, రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక తదితరులు పాల్గొన్నారు.
పర్లాకిమిడిలో..
పర్లాకిమిడి: గంజాం జిల్లా గోపాల్పూర్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన నిరసిస్తూ విపక్ష బీజేడీ ఛత్ర పరిషత్ నాయకులు బుధవారం పర్లాకిమిడి హైస్కూల్ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బీజేడీ ఛత్ర సంసద్ అధ్యక్షుడు త్రిపాఠి హెచ్చరించారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బిశ్వజిత్ త్రిపాఠి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్నాయక్, కాశీనగర్ నగర పంచాయతీ ఉపాధ్యక్షుడు రఘురాం సాహు, గుసాని జెడ్పీ సభ్యులు శాసనం బాలరాజు, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, ఎస్.గజపతిరావు, బీజేడీ యువజన నాయకులు శాసనం లింగరాజు తదితరులు పాల్గొన్నారు.

బీజేడీ శ్రేణుల ఆందోళన

బీజేడీ శ్రేణుల ఆందోళన

బీజేడీ శ్రేణుల ఆందోళన

బీజేడీ శ్రేణుల ఆందోళన

బీజేడీ శ్రేణుల ఆందోళన

బీజేడీ శ్రేణుల ఆందోళన