
రథయాత్రకు త్రివిధ భద్రత
● డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ విజయవంతం ● శ్రీ జగన్నాథ ధామ్ యాప్ ప్రారంభం
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధునాతన వ్యవస్థతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జల, స్థల, వాయు మార్గాల్లో యాత్ర సమగ్ర పరిసరాలపై నిఘా పెట్టారు. ఇటీవల కాలంలో పూరీ శ్రీ మందిరం శిఖరాన డ్రోన్ సంచారం కలవరపరుస్తోంది. యాత్ర పురస్కరించుకుని ఈ బెడద తలెత్తకుండా అధునాతన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని ప్రవేశ పెట్టారు. పటిష్టమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం శక్తివంతమైన వాహనాలు తదితర సరంజామాతో నిపుణులైన సిబ్బందిని రంగంలోకి దింపారు. ఈసారి కృత్రిమ మేధస్సుని విస్తారంగా ప్రయోగిస్తున్నారు. ఏఐ అనుసంధానంతో పూరీ పట్టణ వ్యాప్త సీసీటీవీ వ్యవస్థ పర్యవేక్షణ, వాహనాల రవాణా తదితర కార్యకలాపాలు చేపడుతున్నారు. భద్రతా యంత్రాంగంతో యాత్రికులు, సాధారణ ప్రజానీకానికి ఏఐ అనుసంధానం అక్కరకు రానుంది. ఈ ఏడాది తొలి సారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా బుధవారం ఈ క్రేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించారు. రథ యాత్ర పురస్కరించుకుని పూరీ పట్టణం వాహనాల రవాణాతో రద్దీగా తయారుకాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రద్దీ పెరుగుదలకు అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ని జారీ చేశారు. ఈ కోడ్ని స్కాన్ చేయడంతో వాహనాల రవాణా తాజా వ్యవస్థని ప్రతి ఒక్కరూ సులువుగా తెలుసుకునేందుకు వీలు కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదింపుల కోసం 112కు డయల్ చేయాలని పూరీ పోలీసు యంత్రాంగం ప్రకటించింది.
డ్రోన్ కూల్చివేత
రథయాత్రకు ప్రతిపాదించిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని బుధవారం ప్రారంభించారు. ఈ వ్యవస్థ తొలి విజయాన్ని సాధించింది. శ్రీ మందిరం శిఖరం ఆకాశ మార్గంలో సంచరిస్తున్న డ్రోన్ కుప్ప కూలింది. దీన్ని పరిశీలించగా శ్రీ మందిరం దక్షిణ ద్వారం పరిసరాల్లో శ్రీ మందిరంపై చక్కర్లు కొడుతున్నట్లు తేలింది. కొత్తగా ప్రారంభించిన డ్రోన్ వ్యతిరేక వ్యవస్థని దీన్ని కుప్ప కూల్చింది. ఈ వ్యవహారంలో అనుమానిత వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కుప్పకూలిన డ్రోన్ స్వాధీనపరచుకుని నిర్వీర్యపరిచారు. దీని ప్రయోగం పూర్వాపరాలపై విచారణ కొనసాగుతుంది. శ్రీ మందిరం ప్రాంగణనం నో ఫ్లయింగ్ జోన్ పరిధిలో ఉన్నందున డ్రోన్ వినియోగం నిషేధంగా పేర్కొన్నారు. తీర ప్రాంతంలో కోస్టు గార్డుల పహరా ఏర్పాట్లు చేశారు. సముద్ర మార్గంలో అవాంఛనీయ, అభ్యంతరకర చొరబాటులు నివారించేందుకు ఈ వ్యవస్థ రాత్రింబవళ్లు పని చేస్తుంది. సాగర తీరంలో కెరటాల్లో కొట్టుకుపోవడం వంటి సంఘటనల నివారణకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన లైఫ్ గార్డుల్ని తీరంలో అనుక్షణం అందుబాటులో ఉండేలా నియమించారు.
శ్రీ జగన్నాథ ధామ్ యాప్
ఈ ఏడాది యాత్ర సందర్భంగా శ్రీ జగన్నాథ ధామ్ మొబైల్ యాప్ ప్రారంభించారు. దీనిలో దర్శన వేళలు, సేవా బుకింగు, వసతి సమాచారం, ఆలయ సేవలు, నిత్య పూజాదులు, దర్శనం కోసం క్యూ తాజా పరిస్థితి, రథ యాత్ర సౌకర్యాలు, అత్యవసర సేవలు సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది.

రథయాత్రకు త్రివిధ భద్రత

రథయాత్రకు త్రివిధ భద్రత

రథయాత్రకు త్రివిధ భద్రత

రథయాత్రకు త్రివిధ భద్రత