
ఈస్టుకోస్ట్ రైల్వే ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మిశ్ర
కొరాపుట్: ఈస్టుకోస్ట్ రైల్వే విభాగ ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మి శ్ర నియమితులయ్యారు. గురువారం ఈస్ట్కోస్ట్ రైల్వే ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ ప్రస్తుతం జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పని చేస్తున్నారు. ఇకపై నబరంగ్పూర్ జిల్లాలో ఈస్ట్కోస్ట్ రైల్వే శాఖ తరుపున అన్ని కేసులు వాదించనున్నారు. ప్రస్తుతం నబరంగ్పూర్–జయపూర్, నబరంగ్పూర్–జునాఘడ్ రైల్వే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలపై అభ్యంతరాలు తెలుపుతూ అనేక కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కేసులు వాదించడానికి సంతోష్ని నబరంగ్పూర్ జిల్లాలో నియమించింది.
యాత్రికులకు జీవిత బీమా
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా భక్తులు, యాత్రికులకు రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పూరీ మున్సిపల్ ప్రాంతం పరిధిలో జరిగే ప్రమాదాలకు మాత్రమే ఈ బీమా సౌకర్యం పరిమితం. యాత్ర సమయంలో ప్రమాదాలు, అసహజ మరణాలు, తొక్కిసలాటలు, ఉగ్రవాద దాడులు వంటి ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సౌకర్యాన్ని సేవకులు, శ్రీ జగన్నాథ ఆలయ సిబ్బందికి విస్తరింపజేయడం విశేషం.
విద్యుత్ కోతలపై నిరసన
కొరాపుట్: విద్యుత్ కోతలను నిరసిస్తూ నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రం విద్యుత్ సెక్షన్ కార్యాలయం ముందు స్థానికులు గురువారం ఆందోళన చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడైన స్తంభాలు, వైర్లు మార్చాలని, ప్రతీ పంచాయతీకి ఫీడర్ ఏర్పాటు చేయాలని, స్మార్ట్ మీటర్లు తొలగించి, పాత మీటర్లు పునరుద్దరించాలని కోరారు. అలాగే అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తి వేయాలని, విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకి సంఘీభావం ప్రకటిస్తూ మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి బైఠాయించారు.
రథ యాత్రలో ఉచిత ఆటో సేవలు
భువనేశ్వర్: పూరీ రథయాత్రలో ఉచిత ఆటో సేవల సౌకర్యం కల్పించినట్లు రాష్ట్ర రవాణా, వాణిజ్య శాఖ మంత్రి బిభూతి జెనా తెలిపారు. యాత్రికులకు 200 ఆటోలు ఉచిత సేవలు అందిస్తాయి. దీంతో ఉచిత ఆహారం సరఫరా అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి పూరీ యాత్ర స్థలానికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసే బస్సులు నిలిపేందుకు 28 ప్రదేశాల్లో పార్కింగ్ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
హత్య కేసులో మరో ఐదుగురు నిందితులు అరెస్టు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు ఒక హత్యకేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో జుమురుగుడ గ్రామానికి చెందిన శివ సాహు, సంతోష్ సాహు, అమర్ సాహు, పింకూ సాహు, బుడుపలమలు ఉన్నారు. గతేడాది మే 21వ తేదీన జుమురుగుడ గ్రామంలో నివాసముంటున్న భైరవ సాహు అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడన్న ఆరోపణపై గ్రామంలో కొందరు అత్యంత దారుణంగా మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో 21 మందిని పద్మపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
కేరళలో గజపతి జిల్లా వలస కూలీ మృతి
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ అడవ పంచాయతీ గరడమా గ్రామనివాసి మహేంద్ర బోలియార్సింగ్ (30) పని కోసం కొద్దిరోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం వెళ్లి ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ కింద పడి మృతి చెందినట్టు అడవ పోలీసు అధికారికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మహేంద్ర బోలియార్సింగ్ నుంచి ఎలాంటి సమాచారం గానీ ఫోన్ కాల్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులకు మృతి చెందినట్టు రైల్వే పోలీసుల నుంచి సమాచారం అందింది. దీంతో మహేంద్ర కుటుంబసభ్యులు ఎర్నాకుళం నుంచి మృతదేహాన్ని తీసుకురావాలని బీడీఓను కోరారు.

ఈస్టుకోస్ట్ రైల్వే ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మిశ్ర

ఈస్టుకోస్ట్ రైల్వే ప్యానల్ అడ్వకేట్గా సంతోష్ మిశ్ర