కనరో భాగ్యము | - | Sakshi
Sakshi News home page

కనరో భాగ్యము

Jun 27 2025 4:45 AM | Updated on Jun 27 2025 4:45 AM

కనరో

కనరో భాగ్యము

● నేడే పూరీ రథయాత్ర ● సకల ఏర్పాట్లు సంసిద్ధం

భువనేశ్వర్‌: శ్రీక్షేత్రంలో ఉత్సవ ఉత్సాహం కనిపిస్తోంది. ఆషాఢ శుక్ల పక్ష ప్రతిపద తిథి పురస్కరించుకుని శ్రీ మందిరంలో మూల విరాట్లు నవయవ్వన రూపంలో గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. మరో వైపు శుక్రవారం జరగనున్న యాత్ర కోసం స్వామిని తీసుకుని వెళ్లేందుకు శ్రీ మందిరం సింహ ద్వారం ముంగిటకు చేరాయి. తయారీ ప్రాంగణం నుంచి దక్షిణాభిముఖంగా మూడు కొత్త రథాలు వరుస క్రమంలో శ్రీ మందిరం ముంగిటకు చేరాయి. ఈ యాత్ర ఉభా యాత్రగా సుపరిచితం. అన్న బలభద్ర స్వామి అనుమతితో శ్రీ జగన్నాథుని రథం నందిఘోష్‌ ముందుగా తయారీ ప్రాంగణం నుంచి బయల్దేరడం విశేషం. వెంబడి సోదరి దేవీ సుభద్ర రథం దర్ప దళనం బయల్దేరింది. చివరగా బలభద్ర స్వామి రథం తాళ ధ్వజం శ్రీ మందిరం వాకిలికి చేరింది. ఈ దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. నవ యవ్వన దర్శనాన్ని ఉభా యాత్రగా పేర్కొంటారు. సాయంత్రం 4.40 గంటలకు మూల విరాట్ల నుంచి ఆజ్ఞా మాలలు చేరడంతో మూడు రథాలు వరుస క్రమంలో లాగడం ప్రారంభించారు. ముందస్తు సన్నద్ధత ప్రకారం పోలీసుల భద్రత వలయాల మధ్య రథాలు సురక్షితంగా ముందుకు సాగాయి.

రాత్రంతా సన్నాహాలు

స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతగా తహతహలాడి పోయారో భక్తులకు కనులారా దర్శనం ప్రసాదించేందుకు స్వామి అంతకంటే అధికంగా ఆరాటపడడం అద్భుతం. తెల్లారితే పరిపూర్ణ దర్శనంతో నేత్రోత్సాహం కలిగించేందుకు రాత్రి అంతా స్వామి మేలుకొని ఏకాంత సేవకు దూరమయ్యాడు. స్నాన యాత్ర నుంచి 15 రోజుల విరామం తర్వాత దేవతలు నవయువ వేషంలో భక్తులకు నవ యువకునిగా దర్శనం ఇచ్చేందుకు శ్రీ ముఖ అలంకరణ (బొనొకొ లగ్గి)లో తలమునకలయ్యాడు. ఒణొసొరొ చతుర్దశి, ఆషాఢ అమావాస్య తిథి నాడు ఆలయ సంప్రదాయ నియమాల ప్రకారం దత్త మహా పాత్రో సేవకులు మూల విరాట్లకు శ్రీ ముఖ సేవతో నవ యవ్వనంగా తీర్చిదిద్దారు. అనంతరం నవయువ దర్శనం సన్నాహాలు ప్రారంభించారు. రథాల పైకి వెళ్లే ముందు శ్రీ మందిరంలో ఆకర్షణీయమైన అలంకరణలో చతుర్థామూర్తులను దర్శించుకోవడం అపురూప అవకాశంగా భక్తులు భావిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీ మందిరం దక్షిణ ద్వారం గుండా దర్శనానికి అనుమతించారు. తొలి గంట పరకామణి దర్శనం కల్పించారు. ఆ తర్వాత సర్వ దర్శనానికి అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు స్వల్ప అంతరాయంతో భక్తులకు దర్శనమిచ్చారు.

చిత్ర పటాల తొలగింపు

భారీ స్నానంతో స్వామి అస్వస్థతకు గురి కావడంతో తెరమరుగైన 15 రోజులపాటు ప్రధాన దేవతల ప్రతీకగా దర్శనం ఇచ్చిన చిత్ర పటాల దేవుళ్లను ముందుగా తొలగించారు. చిత్ర పటాలతో పూజలందుకున్న శ్రీ జగన్నాథుని ఉత్సవ మూర్తి మదన మోహనుడు, డోల గోవిందుడు, బలభద్రుని ఉత్సవ మూర్తులు రామకృష్ణులు, నృసింహుని దక్షిణ గృహానికి తరలించారు. శ్రీ దేవి, భూదేవి ఉత్సవ మూర్తుల్ని శయ్యా గృహానికి తరలించారు. అనంతరం బలభద్ర స్వామి ప్రతీక రూపం అనంత వాసుదేవుడు, శ్రీ జగన్నాథుని ప్రతీక చిత్రపట దేవుడు అనంత నారాయణుడు, దేవీ సుభద్ర ప్రతీకగా పూజలందుకున్న భువనేశ్వరి చిత్రటాలను విమలా దేవి ఆలయం సమీపంలో మొండొణి గృహానికి తరలించారు. తెరలు తొలగడంతో చివరగా దేవతలు చికిత్స పొందిన ప్రాంగణంలో మంచం వగైరా తొలగించి కడిగి సున్నం నీరు చిమ్మి శుద్ధి చేశారు. కొఠొ సుంవాసియా సేవకులు ఈ పనుల్లో పాలుపంచుకోవడం ఆచారం. ఈ తంతు అంతా ముగిసే సరికి తెల్లారి పోవడంతో బుధవారం రాత్రి అంతా మెలకువగానే ఉండాల్సి వచ్చింది. నిర్విరామంగా భక్తులకు కనులారా దర్శనం ప్రసాదించి నేత్రోత్సవం జరుపుకున్నాడు.

నేడు రథ యాత్ర

స్వామి పూర్తిగా కోలుకుని నవ యువకుని ఉత్సాహంతో యాత్ర కు సిద్ధమయ్యాడు. యాత్ర కోసం రథాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని స్వామి రాక కోసం నిరీక్షిస్తున్నాయి. స్వామి తెర మరుగున ఉన్న రోజుల్లో వేధించిన ఉక్కపోత వాతావరణం సానుకూలంగా మారింది. అదే సమయంలో వరుణ దేవుడు కరుణించే సంకేతాలు లభిస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర వారం భారీ నుంచి అతి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. పూరీలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఈ కేంద్రం ముందస్తు సమాచారం జారీ చేసింది. ఉపరితల గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు ఉంటుందని అంచనా.

సింహద్వారం

ముంగిటకు రథాలు

రథయాత్ర కోసం మూడు రథాలు శ్రీమందిరం సింహద్వారం ముంగిటకు సురక్షితంగా చేరాయి. రథాలపైకి మూల విరాటులు తరలించేందుకు వీలుగా అమర్చాల్సిన చారుమళ్లు, రథాలు లాగేందుకు అవసరమైన తాళ్లు తదితర సామగ్రి రథాల ప్రాంగణానికి చేరాయి. రథాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం 5.00 గంటలకు రథాల తయారీ ప్రాంగణం నుంచి బయల్దేరిన శ్రీజగన్నాథుని నందిఘోష్‌ రథం సాయంత్రం 5.40 గంటలకు, తర్వాత సాయంత్రం 5.54 గంటలకు బయల్దేరిన సుభద్ర రథం దర్ప దళనం సాయంత్రం 6.26 గంటలకు, చివరగా సాయంత్రం 6.37 గంటలకు బయల్దేరిన బలభద్రుని తాళధ్వజం రాత్రి 7.15 గంటలకు శ్రీమందిరం సింహద్వారం ముంగిటకు చేరాయి.

కనరో భాగ్యము 1
1/1

కనరో భాగ్యము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement