
ప్రజల వద్దకు అధికారులు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు అధికారులు చేరనున్నారు. తమది ప్రజల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తరచు బహిరంగ సభల్లో ప్రకటిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నరు భారత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి ప్రవేశపెట్టిన పలు పథకాల పట్ల అవగాహన కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అట్టడుగు స్థాయి పాలనను మెరుగుపరచడం అనివార్యంగా అధికార యంత్రాంగం గుర్తించింది. వివిధ అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షించడానికి ఉన్నతాధికార వర్గం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన బుధవారం వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ప్రభుత్వ సీనియర్ అధికారులు, కార్యదర్శులు వివిధ జిల్లాలు విస్తృతంగా సందర్శించాలని ప్రముఖ కార్యదర్శి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ కార్యాలయం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.
● అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు ఏటా జూన్, ఆగస్టు మధ్య వివిధ జిల్లాలకు క్షేత్ర పర్యటనలు చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కార్యాచరణతో వాస్తవంగా లబ్ధిదారులకు చేరుతున్న ప్రయోజనాల్ని విశ్లేషించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్శనలో అధికారులు జిల్లాల్లో కనీసం 2 నుంచి 3 రోజులు బస చేసి పంచాయతీ, మండల స్థాయిలో ప్రజా స్పందనతో పాలన తీరుని సమీక్షిస్తారు. కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించి స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన ఈ కార్యక్రమం లక్ష్యం. దీనిలో భాగంగా అధికారులు గ్రూప్ హెల్త్ సెంటర్లు, గిరిజన రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేస్తారు.