
సెంచూరియన్లో తొలిసారిగా రథయాత్ర
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీలో ఈ నెల 27న జరుగనున్న రథయాత్ర కోసం జగన్నాథ రథాన్ని తయారుచేశారు. తొలిసారిగా వర్సిటీ క్యాంపస్లో రథయాత్రను నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు తెలిపారు. తొలుత వర్సిటీకాక ముందు జగన్నాథ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మ్యానేజ్మెంటు ఇంజినీరింగ్ కళాశాల ఉండేది. తదనంతరం సెంచూరియన్ వర్సిటీగా రూపాంతరం చెందింది. క్యాంపస్లో రథయాత్రను నిర్వహించనుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గంజాయి నిర్మూలనపై
స్పష్టమైన ప్రణాళిక ●
● డీఐజీ గోపినాథ్ జెట్టి
శ్రీకాకుళం క్రైమ్: గంజాయి నిర్మూలన, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ సెంటర్లకు తరలింపుపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5న పాడేరులో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఉంటుందని తెలియజేశారు. గడిచిన 2024–25లో గంజా అక్రమ రవాణాపై 694 కేసులు నమోదు చేసి 40,063 కిలోల గంజాయి, 18 కిలోల హనీష్ ఆయిల్, 478 వాహనాలను స్వాధీనం చేసుకొని 1,945 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశాలు పెడుతున్నామని, 26 స్టాటిక్ చెక్పోస్టుల వద్ద 183 కేసుల్లో 11,047 కిలోల గంజాయి సీజ్ చేసి 469 మందిని అరెస్టు చేశామన్నారు. అదనంగా ఉన్న 298 డైనమిక్ చెక్పోస్టుల వద్ద 237 కేసుల్లో 21,070 కిలోల గంజాయి సీజ్ చేసి 743 మందిని అరెస్టు చేశామన్నారు. రవాణా చేసే ఎనిమిది మంది వ్యాపారుల నుంచి రూ.9.76 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, 1310 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం షీట్స్ తెరిచామన్నారు. 50 మందిపై పీడీ చట్టం, 19 మందిపై పీటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదించామన్నారు. రవాణాలో పాల్గొన్న 527 మందిని, గంజాయితోపాటు ఇతర నేరాల్లో పాల్గొన్న 348 మందిని ఇప్పటికే గుర్తించామన్నారు. 2024–25 కాలంలో 23 కేసుల్లో 40 మంది ముద్దాయిలకు న్యాయస్థానం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిందన్నారు.