
పురాతన మందిరం నేలమట్టం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో ఉన్న వందేళ్ల పురాతన గ్రామదేవత ఠకురాణి మందిరాన్ని నేలమట్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పాటు భక్తులు విరాళాలు సుమారు 50 లక్షల రూపాయలతో అదే స్థానంలో నూతనంగా ఠకురాణి మందిరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పాత మందిరాన్ని విరగ్గొట్టే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. సుమారు 40 అడుగుల ఎత్తులో నిర్మితమవనుంది. ఇందులో భాగంగా అమ్మవారి గర్భగుడితో పాటు భక్తులు దర్శనం అనంతరం సేదతీరేందుకు ప్రత్యేకమైన మండపం, అలాగే అమ్మవారి పూజా సామగ్రిని భద్రపరిచే మరో గదిని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని మందిర కమిటీ సభ్యులు తెలిపారు.
రాష్ట్రానికి తొలి స్వర్ణం
భువనేశ్వర్: స్థానిక కళింగ స్టేడియంలో 78వ సీనియర్ జాతీయ జల క్రీడల చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రానికి తొలి స్వర్ణ పతకం దక్కింది. 100 మీటర్ల బటర్ఫ్లై మహిళా ఈవెంట్లో ఒడిశాకు చెందిన ఏస్ స్విమ్మర్ శ్రుతి ఉపాధ్యాయ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యేకంగా అభినందించారు.
చిరిగిన జాతీయ పతాకం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా జయపూర్ పట్టణంలో ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఉన్న భారీ జాతీయ పతాకం చిరిగిపోయింది. ఇది గమనించిన వారు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన మార్పించారు. వంద అడుగుల ఎత్తులో 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఏర్పాటు చేశారు. పతాకం నిర్వాహకుడు నిసాన్ పట్నయక్ మాట్లాడుతూ రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పతాకం చిరిగిందన్నారు. తాము అది గమనించే సరికే సోషల్ మీడియా వచ్చిందని, వెంటనే మార్చామని ప్రకటించారు.
గణితంలో అత్యున్నత
పరిశోధనలకు మద్దతు
భువనేశ్వర్: నగరం శివార్లులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ అప్లైడ్ సైన్సెస్ కొత్త గ్రంథాలయ భవనానికి రాష్ట్ర విజ్ఞానం, సాంకేతిక శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో సోమవారం శంకుస్థాపన చేశారు. గణితంలో అత్యున్నత పరిశోధనలను నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలను అందించడానికి కట్టుబడి ఉందని, ఆయన అన్నారు. గణితంలో అధిక నాణ్యత పరిశోధనలు, పాఠశాల, కళాశాల స్థాయిలలో గణిత విద్యపట్ల ఆసక్తి ప్రేరణ, ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. కొత్త గ్రంథాలయ భవనం సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశలో ఉపాధ్యాయులకు వసతి, హాస్టళ్లు, తరగతి గదులు నిర్మిస్తారు. నగరంలో 100 ఎకరాల స్థలంలో సైన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న ఐదేళ్లలో బయోటెక్నాలజీ కింద 17 ప్రధాన రంగాలలో రూ. 1113 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ సందర్భంగా విజ్ఞానం, సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్ర అరుముగం మాట్లాడుతూ మానవాళి సంక్షేమం కోసం గణితాన్ని మరింత పరిశోధనలకు అన్వయించాలని విద్యార్థులకు సూచించారు. రానున్న ఐదేళ్లలో అప్లైడ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్ విత్ డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటేషనల్ ఫైనాన్స్, మ్యాథమెటిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఈ సంస్థ ప్రారంభిస్తుందని ఆమె తెలియజేశారు.