
పాలకుల ఆలస్యం.. గిరిజనుల లౌక్యం
కొరాపుట్: దశాబ్దాలు గడుస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో గిరిజనులు లౌక్యంతో తాత్కాలిక కర్ర వంతెన నిర్మించుకున్నారు. కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి బద్దిగుడ గ్రామ పంచాయతీ డొక్రిపొడ–ఉద్ది పొడ గ్రామాల మధ్య ఈ నిర్మాణం జరిగింది. వర్షాకాలం వస్తే డొక్రిపొడ నది ఉప్పొంగుతుంది. దాంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. కొరాపుట్ జిల్లాలో చివర డొక్రిపొడ నదికి అవతల ఉద్దిపొడ గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఆనుకొని మల్కన్గిరి జిల్లా ప్రారంభం అవుతుంది. గిరిజనులు రేషన్ బియ్యం, పంచాయతీ కార్యాలయ పనులు, విద్య కోసం నది దాటాలి. వర్షాకాలం వస్తే ప్రాణాలు పణంగా పెట్టి వెళ్లాలి. ఇక్కడ వంతెన నిర్మించాలని ఇరు వైపులా 20 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నా ఫలితం లేక పోయింది. దాంతో గ్రామస్తులే విరాళాలు వేసుకొని నది మధ్యలో సిమ్మెంట్ స్తంభం నిర్మించారు. అనంతరం దాని మీద కర్రలు వేసి తాత్కాలిక వంతెన నిర్మించారు. ఇది పాదచారులకు అనుకూలంగా మారింది. సోమవారం నుంచి ఈ వంతెన గిరిజనుల రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంపై కొరాపుట్ జిల్లా ఆర్డీ విభాగం అధికారులు స్పందిస్తూ అక్కడ వంతెన నిర్మాణం నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు వేస్తామని హామీ ఇచ్చారు.