
అధికారుల పనితీరుపై అసంతృప్తి
జయపురం: జయపురం సబ్డివిజన్ కొట్పాడ్ సమితిలోని అధికారుల పనితీరుపై ఆ సమితి సర్పంచ్ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొట్పాడ్ సమితి చతర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్ల సంఘ సమావేశం నిర్వహించింది. సర్పంచ్ త్రినాథ్ మఝి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితిలోని పలు సమస్యలపై చర్చించారు. కురమకోట్ నుంచి మహంతిపుట్, కొంగియగుడ నుంచి మఝిగుడ, అవళభట నుంచి కుకిడిపొదర్, దువుర్ల నుంచి సెమల, భుర్ష వరకు, ఖడగపూర్ నుంచి భలుగుడ, టెమరగుడ, ఫిటకి కుంభి నుంచి నదీఘాట్, చిత్ర నుంచి పఠాన్గుడ, ఝనికికజివా రోడ్డు వరకు అన్ని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని సమావేశంలో సర్పంచ్లు ఆరోపించారు. అధికారులు సమితి వీడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లటం లేదని, జన సునాని కార్యక్రమంలో వారు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. మండీలలో ధాన్యం క్రయవిక్రయాల సమయంలో సంంబంధిత అధికారులు అంతా ఉండాలని జిల్లా అధికారులు తెలిపినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఏఈఈ అనుచితంగా వ్యవహరించగా బాధిత భనసులి పంచాయతీ సర్పంచ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దానిని మాఫీ చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను విస్మరించి కంట్రాక్టర్లకు సహకరిస్తున్నారని, అందువలన రెండు పంచాయతీలలో అటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించటం లేదనిన్నారు. సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు దేబొ మఝి, కార్యదర్శి కమల పూజారి, సర్పంచ్లు బుదాయి మఝి, కమల చలాన్, బొనిత మఝి, పుష్ప పూజారి, సనమతి గదబ, పూర్ణ పూజారి, మనమతి పూజారి, తదితరులు పాల్గొన్నారు.