
గుండిచా ఆలయ పనులపై సమీక్ష
భువనేశ్వర్: నవ దినాత్మక యాత్రకు విచ్చేయనున్న శ్రీ జగన్నాథుని రాక కోసం గుండిచా ఆలయం నిరీక్షిస్తోంది. ఏటా రథ యాత్ర పురస్కరించుకుని స్వామి సోదర సోదరీ సమేతంగా ఈ ఆలయంలో అడపా మండపంపై కొలువు దీరుతాడు. ఈ సందర్భంగా ఆలయం పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ పనుల్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యక్షంగా గుండిచా ఆలయాన్ని సందర్శించి సమీక్షించారు. రథ యాత్ర తుది సన్నద్ధత సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఈ మందిరం సందర్శించారు. ఆయనతో ఇరువురు ఉప ముఖ్యమంత్రులు ప్రభాతి పరిడా, కనక వర్ధన్ సింగ్దేవ్, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా సందర్శించారు.