
అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్, సీనియర్ అడ్వకేట్ పినిపే వెంకట రామకృష్ణ అన్నారు. నగరంలోని ఇలిసిపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ క్యాడర్ క్యాంపు శనివారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 158 బార్ కౌన్సిల్లు ఉన్నాయని, వాటిలో ఏఎఎఫ్ క్యాడర్ కూడా ఉందన్నారు.
ఎనిమిది వేల మంది ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులున్నారని, మనమంతా ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఏఏఎఫ్ అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ మూమెంట్ నడపాలంటే కఠోర దీక్ష ఉండాలని, నాయకునికి ఎటువంటి బలహీనతలు ఉండకూడదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీలను విభజించి పాలిస్తున్నాయన్నారు. ఈసారి రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీల్లో ముగ్గురు న్యాయవాదులు తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు ఎవ్వరూ ఎటువంటి పదవులు ఇవ్వరని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బతికినంత కాలం అంబేడ్కర్ విధానంతో బతకాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పొన్నాడ రాము, బి.మురళీకృష్ణ, రుంకు అప్పారావు, గంజి ఆర్.ఎజ్రా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ దండాసి తదితరులు పాల్గొన్నారు.