
కొండను ఆక్రమించుకుంటే సహించేది లేదు
రాయగడ: విలువైన వృక్ష సంపద, ఔషధ మొక్కలను నాశనం చేసి కొండను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని బిసంకటక్ సమితి బక్సీసిరిపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం బిసంకటక్ పోలీసుస్టేషన్, అటవీ శాఖ, తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని వినతిపత్రాలను సమర్పించారు. బక్సీసిరిపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్వలాభాల కోసం గ్రామ సమీపంలోని చెట్లను నరికివేస్తున్నారని పేర్కొన్నారు. కొండపై ఉన్న వృక్ష సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. పచ్చని చెట్లు, విలువైప ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కొండపై ఉన్నాయని, అదేవిధంగా అటవీ ఉత్పత్తులను సేకరించి జీవనోపాధిని పొందే ఎంతోమంది ఈ కొండపై ఆధారపడుతున్నారని తెలియజేశారు. స్వప్రయోజనాల కోసం కొండను నాశనం చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని కొండను కాపాడాలని కోరారు.

కొండను ఆక్రమించుకుంటే సహించేది లేదు