
శ్రీ జగన్నాథునికి మసృణ లేపన సేవ
భువనేశ్వర్: రాజ వైద్యుల ఆధ్వర్యంలో తెర చాటున గోప్యంగా చికిత్స పొందుతున్న శ్రీ జగన్నాథుడు క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు వస్తున్నాయి. అనవసర నవమి తిథి పురస్కరించుకుని గురువారం మూల విరాటులకు మసృణ లేపన సేవతో వైద్యం కొనసాగించారు. సుభాషిత నువ్వుల నూనెలో గుగ్గిలం జోడించి మిశ్రమంగా తయారు చేసి మూల విరాట్లకు లేపనం చేయడాన్ని మసృణ లేపన సేవగా వ్యవహరిస్తారు. ఇంతకు ముందు అనవసర పంచమి నాడు మూల విరాటుల అంగాలకు ఫులురి తైల మర్దన చేసిన విషయం తెలిసిందే.
నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నూతన జాతీయ విద్య విధానంపై అభివృద్ధి మేళాలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజన్ పాణిగ్రాహి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ వేధ్బర్ ప్రధాన్ హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని డిగ్రీ, డిప్లమా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకంగా ఒడియా భాష, కళలు, సంస్కృతిపై దృష్టి పెట్టాలన్నారు. నూతన జాతీయ విదా విధానంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. 250 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
30 యూనిట్ల రక్తం సేకరణ
పర్లాకిమిడి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో గురువారం రక్తదాన శిబిరాన్ని గజపతి జిల్లా బ్లడ్ డోనర్స్ సంఘం ప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ముఖ్య వైద్యాధికారి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మహ్మద్ ముబారక్ ఆలీ, సీనియర్ ఫార్మాసిస్టు ఖగేశ్వర బెహరా తదితరులు హాజరయ్యాన్నారు. 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో గజపతి బ్లడ్ డోనర్స్ సంఘం అధ్యక్షుడు గవర నవీన్కుమార్, ఉపాధ్యక్షుడు ఎస్.రుషి, కె.శరత్కుమార్, క్రాంతి బెహరా, సుస్మిత, మోహినీ ప్రదాన్పాల్గొన్నారు.
యోగా దినోత్సవం
విజయవంతం చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జరిగే యోగాలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ అనే థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అదే విధంగా, అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల సమన్వయకర్త గ్రేస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 19 నుంచి జిల్లాలోని 8 పాఠశాలల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలురుకు దుప్పలవలస, బాలికలకు ఎచ్చెర్ల గురుకులంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరో తరగతిలో 279 సీట్లు, ఏడో తరగతిలో 155 సీట్లు, ఎనిమిదో తరగతిలో 92 సీట్లు, 9వ తరగతిలో 96 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాలకు 9701736862 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేష్కుమార్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూటికుప్పల సురేష్కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నాగళ్ల మురళీధర్, జిల్లా కార్యదర్శిగా కవిటి దేవరాజ్, జిల్లా ప్రచార కార్యదర్శిగా కిల్లి కుమారస్వామిని నియమించారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

శ్రీ జగన్నాథునికి మసృణ లేపన సేవ