
నేడు బీజేపీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం
భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తొలి సారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని శుక్రవారం తొలి వార్షికోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధానంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రత్యక్షంగా ప్రధాన మంత్రి ప్రసంగించనున్న జనతా మైదానం సందర్శించి ఏర్పాట్లని గురువారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయనతో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, రాష్ట్ర పోలీసు డైరెక్టరు జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా వంటి ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి పర్యటన కార్యక్రమాలు
●ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీపీఐఏ)చేరుతారు.
● ప్రధానమంత్రికి సంప్రదాయ రీతుల్లో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ప్రధాన మంత్రి విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం జనతా మైదాన్ వరకు భారీ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మార్గంలో రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే అనేక ఒడియా జానపద సంగీతం, నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహక వర్గాలు తెలిపాయి.
● ఊరేగింపుతో సభా ప్రాంగణంకు చేరడంతో జనతా మైదానంలో సాయంత్రం 4.15 గంటల నుంచి 5.30 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రూ. 17,000 కోట్ల విలువైన కొత్త అభివృద్ధి మరియు సంక్షేమ ప్రాజెక్టుల ప్రారంభిస్తారు. రాష్ట్ర వృద్ధికి దీర్ఘకాలిక భావి ప్రణాళిక కార్యాచరణ వివరించే ఒడిశా విజన్ డాక్యుమెంట్ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు.
● ఈ సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. తిరిగి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థానిక విమానాశ్రయం నుంచి సాయంత్రం 5.50 గంటలకు న్యూ ఢిల్లీకి బయలుదేరుతారు.
భారీ భద్రత బందోబస్తు
ప్రధాన మంత్రి పర్యటన పురస్కరించుకుని భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), కమిషనరేట్ పోలీస్, అగ్ని మాపక దళం, రాష్ట్ర నిఘా, ఉగ్రవాద వ్యతిరేక యూనిట్లతో బహుళ వర్గాలతో భద్రతా వలయం ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి బహిరంగ సభా ప్రాంగణం వరకు జరిగే భారీ ఊరేగింపు బాధ్యతల్ని భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో నగరాన్ని విమానాశ్రయం నుండి సభా ప్రాంగణం వరకు నో–డ్రోన్, నో–ఫ్లై జోన్గా ప్రకటించారు. వేడుకలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 60 మంది ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఓఏఎస్) అధికారులను నియమించింది.
● ప్రధాన మంత్రి రాక ప్రత్యేక ఆకర్షణ