
రథయాత్రకు ప్రజలు సహకరించాలి
పర్లాకిమిడి: ఈ నెల 27న పర్లాకిమిడి రాజవీధిలో జరుగనున్న జగన్నాథస్వామి రథయాత్రకు సంబంధించి రెండోసారి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షతన జిల్లా స్వయం ఉపాధి గ్రామీణ సమావేశ మందిరంలో గురువారం ఉదయం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రథయాత్ర కమిటీ చైర్మన్ సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా ఎస్పీ జ్యోతింద్రనాథ్పండా, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర్ కెరకెటా, తదితరులు హాజరయ్యారు. సమావేశంలో రథయాత్ర కమిటీతో కలెక్టర్ పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. రథయాత్రలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. ఆంధ్ర, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే ఆటోలకు పాత ఫైర్ స్టేషన్ వద్ద పార్కింగ్ సదుపాయం, రాజవీధిలో గుండిచా బడి వెళుతున్న మార్గమధ్యంలో చిల్లర, బోమ్మల దుకాణాలు ఎత్తివేయించాలని పురపాలక ఈఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది రథయాత్రకు అధిక సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అన్నప్రసాదాలు, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. మరో నాలుగు రోజుల్లో మూడు జగన్నాథ రథాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని రథయాత్ర కమిటీ సభ్యులు కలెక్టర్కు నివేదించారు.