
ఇంటిని తీసుకుంటే బతికేదెలా?
సారవకోట: కుమార్తెలు ఆదరించడం లేదంటూ సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు శిమ్మ చిన్నమ్మి వాపోయింది. తనకు ముగ్గురు కుమార్తెలున్నా ఎవరూ ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నుంచి సంక్రమించిన ఇంటిని సైతం చిన్న కుమార్తె ఆధీనంలో తీసుకుని ఇంటి నుంచి పంపించేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిపై తహశీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న కుమార్తె తన ఇంటిని తనఖా పెట్టి రూ.3 లక్షలు అప్పు తీసుకుని చెల్లంచనందున, అప్పు ఇచ్చిన వారు ఆ ఇంటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆ ఇంటిని తీసుకుంటే తనకు నిలువు నీడ కూడా ఉండదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
కలప అక్రమ రవాణా అడ్డగింత
ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట, కింతలమిల్లు జంక్షన్ వద్ద విజిలెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతులు లేకుండా లారీ, బొలెరో వాహనాల్లో తరలిస్తున్న కలపను గుర్తించారు. రూ.39,405 విలువైన తొమ్మిది క్యూబిక్ మీటర్లు కలిగిన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు సతీష్కుమార్, రవిప్రసాద్, సీఐలు రామారావు, అశోక్, ఎస్ఐలు పీసీలు ఈశ్వరరావు, కన్నబాబు, లక్ష్మీనారాయణ, శేషగిరి, సాయిరాం పాల్గొన్నారు.

ఇంటిని తీసుకుంటే బతికేదెలా?