
అధికారాలు సాధిస్తాం
అటవీ భూములపై
రాయగడ: ఏళ్ల తరబడి ఆదివాసీలు అడవి తల్లిని నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులే వీరి జీవనాధారం. ప్రభుత్వాలు మారినా ఆదివాసీల తలరాతలు మారడం లేదు. అడవుల్లో ఉన్న ఆదివాసీలకు అటవీ భూమి పట్టాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేక కష్టాలు పడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో గల భూములను సాధించుకుని తీరుతామని సీపీఐ (ఎంఎల్) మద్దతుతో ఆదివాసీ సంఘర్స్ మోర్చ (ఎఎస్ఎం) నాయకులు అన్నారు. బుధవారం జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల జెరెడీ గ్రామ పంచాయతీలోని తొలొసికబడి గ్రామ సమీపంలో గల అడవుల్లో ఎర్రజెండాలను పాతిపెట్టారు. భూమిని ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ తీరును ఎత్తి చూపుతూ ఆదివాసీలంతా కలిసి వారి సంప్రదాయ ఆయుధాలను పట్టుకుని అటవీ భూముల్లో ఎర్రజెండాలను పాతిపెట్టారు. ఈ గ్రామంలో ప్రారంభమైన ఈ పోరాటం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ నెల 6వ తేదీన అటవీ భూములను ఆదివాసీలకు అప్పగించి వారి పేరిట పట్టాలు పంపిణీ చేయాల్సిందిగా ఆదివాసీ సంఘర్ష మోర్చా ఆందోళన చేపట్టింది. ఈ మేరకు కొలనార తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. అధికారుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపొవడంతో అటవీ భూముల్లో ఆదివాసీలు హక్కు సాధించుకుంటారని, ఈ పోరాటం కొనసాగుతోందని సీపీఐ (ఎంఎల్), ఆదివాసీ సంఘర్ష మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు.

అధికారాలు సాధిస్తాం