
ప్రతి గిరిజనుడు విద్యావంతుడు కావాలి: సీఎం
భువనేశ్వర్: రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వారసత్వంలో గిరిజన సంస్కృతి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. రాష్ట్ర జనాభాలో 40 శాతం దళిత, షెడ్యూల్డ్ కుల వర్గాలు. వీరి అభివృద్ధితో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముడి పడి ఉంది. ప్రతి గిరిజన కుటుంబంలో విద్యావంతుల్ని ఆవిష్కరించడంతో గిరిజన సమాజ అభివృద్ధి బలం పుంజుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రసంగించారు. ప్రతి గిరిజన వ్యక్తిని విద్యావంతునిగా మలిచేందుకు ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందన్నారు. మయూర్భంజ్ జిల్లా బరిపద ప్రాంతం చౌ మైదానంలో రాష్ట్ర స్థాయి ఆదివాసీ శక్తి సమావేశం ప్రారంభం పురస్కరించుకుని ఆయన బుధవారం ప్రసంగించారు. రాష్ట్ర షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ సమావేశం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభిన్న గిరిజన వర్గాలను ఒకచోట చేర్చి సాంస్కృతిక మార్పిడి, ఐక్యతను పెంపొందించేందుకు అవకాశం కల్పించిందని ముఖ్యమంత్రి కొనియాడారు.
దళిత, వెనుకబడిన వర్గాల్లో విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక స్థాయిలలో షాహిద్ మాధో సింగ్ హత్తొ ఖొర్చొ (చేతి ఖర్చులు) పథకం ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. షాహిద్ లక్ష్మణ్ నాయక్ ఆదర్శ్ ఆశ్రమ విద్యాలయ యోజన కింద రూ. 100 కోట్ల వ్యయ ప్రణాళికతో రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గిరిజన జానపదాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి చేసినందుకు వివిధ గిరిజన వర్గాల వ్యక్తులను ముఖ్యమంత్రి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నిత్యానంద గోండ్ (ఎస్టీ – ఎస్సీ అభివృద్ధి), రబీనారాయణ్ నాయక్ ఽ(పంచాయతీరాజ్, తాగు నీరు), డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో (గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధి), గణేష్ రామ్ సింగ్ ఖుంటియా (అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులు) గిరిజన సంక్షేమం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఈ సభా కార్యక్రమానికి రాజ్య సభ సభ్యురాలు మమతా మొహంతా, బాలాసోర్ లోక్ సభ సభ్యుడు ప్రతాప్ చంద్ర షడంగి, మయూర్భంజ్ లోక్ సభ సభ్యుడు నొబొ చరణ్ మాఝీ, శాసన సభ సభ్యులు భాస్కర్ మధేయ్ (ఉదొలా), పద్మ చరణ్ హైబురు (కరంజియా), భదవ్ హంసదా (సొరొసొకొణా), ప్రకాశ్ సోరెన్ (బరిపద), జలెన్ నాయక్ (రాయిరంగపూర్), సంజలి ముర్ము (బంగిరిపొషి), సనాతన్ బిజులి (బొడొసాహి) తదితర ప్రముఖులు హాజరయ్యారు.