
2036 నాటికి మారనున్న రాష్ట్ర రూపురేఖలు
● కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ
రాయగడ: రానున్న 2036 ఏడాది నాటికి రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపొయే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొరాపుట్ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం మచ్చ అన్నారు. స్థానిక బిజు పట్నాయక్ ఆడిటోరియంలో బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వికసత్ ఒడిశా–వికసిత్ జిల్లా పేరిట నిర్వహించిన వర్క్షాప్లో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, వాణిజ్య రంగాలను అభివృద్ధి చేయగలిగితే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతోందన్నారు. ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి మాట్లాడుతూ.. వికసిత్ జిల్లాగా అభివృద్ధిని చూడాలంటే అంతా కలసికట్టుగా కృషి చేయాలని అన్నారు. లక్ష్య సాధనకు చేయిచేయి కలపాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముంతో, కటక్ రెవేన్సా కళాశాల అధ్యాపకులు కిషొర్ చంద్ర నాయక్, విద్యావేత్త డీకే మహాంతి తదితరులు ప్రసంగించి అభివృద్ధికి నాంది పలకాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మచ్చను అధికారులు సత్కరించారు.

2036 నాటికి మారనున్న రాష్ట్ర రూపురేఖలు