
మంత్రుల దృష్టికి గుణుపూర్ సమస్యలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్లో నెలకున్న వివిధ సమస్యలను గుణుపూర్ నవనిర్మాణ సమితికి చెందిన బృందం ఇద్దరు రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు సోమవారం బృందం సభ్యులు రాజధానికి వెళ్లి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారిలను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. గుణుపూర్లో కొత్తగా నిర్మితమవుతున్న జనగ్నాథుని మందిరం ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు సగంలో నిలిచిపోవడంతో.. దేవతా మూర్తులను సగం నిర్మాణంలో గల మందిరంలోనే ఉంచి పూజా కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని మంత్రి హరిచందన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదిలాఉండగా రథాయాత్ర సమయంలో భక్తుల ద్వారా వచ్చిన విరాళాలు మందిరాభివృద్ధికి వినియోగించలేకపొతున్నామని.. సరాసరి ఆదాయం దేవదాయ శాఖ ఖాతాలో డిపాజిట్ చేయాల్సి వస్తుందని వివరించారు. సమస్యలు విన్న మంత్రి స్పందించి త్వరలో మందిరం నిర్మాణం పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు దేవదాయ శాఖ కమిషనర్తో ప్రత్యేకంగా చర్చించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి సురేష్ పూజారిని కలిసిన బృందం గుణుపూర్లో బైపాస్ రోడ్డు నిర్మాణం గురించి ప్రస్తావించింది. గుణుపూర్ నవనిర్మాణ సమితి అధ్యక్షులు అఓయ దాస్, కార్యదర్శి రంజిత పాడి, న్యాయవాది లాడి గొపన్న, జగన్నాధ మందిరం అభివృద్ధి కమిటీ సభ్యులు తిరుపతి మహాంతిలు మంత్రులకు కలిసిన వారిలో ఉన్నారు.